సమస్యా పూరణ పద్యాలు
తేది: 20-11-2005.
Y.M.V.A. శ్రీధరాల వేంకటరమణ మెమోరియల్ హాలు అనకాపల్లి
సమస్య:
పండితులకెల్ల సహజమే పాడు బుద్ధి!
పూరణ:
ఎట్టి సభకైన వేళకునేగుదెంచి
యెక్కి వేదిక మైకున చక్కగాను
వచ్చి, నచ్చిన పద్యాలు వరుస జదువు!
పండితులకెల్ల సహజమే “పాడు“ బుద్ధి
దత్తపది:
మీనము , గానము , దానము , మానము
మత్స్యయంత్ర ఛేదనము - వృత్తం చంపకమాల.
పూరణ:
వరుడయి మీనముంగనియె బాణముదీయుచునర్జునుండు, ము
న్నెరిగినవానిరీతి , నృపుడిచ్చెడు దానముగైకొనంగ, తా
గురిసరి జూచి వేసెనొక కోల, సనముగాగ యంత్రమున్
పొరిబొరి నేలకూలినది, మోహన రాగము గానమై చనన్!!
వర్ణన: ధరల పెంపు - మధ్యతరగతి వారిపై ప్రభావము.
పూరణ: వ్యాటటంచును మనకొక్క వేటువేసి
వస్తు ధరలను పెంచిరి; పస్తులుండు
మధ్యతరగతి వారికి మనుగడెట్లు
సాగగలదయ్య యీనాటి సంఘమందు!!
నిషిద్ధాక్షరి : భారత వికాస్ పరిషత్ సేవను గూర్చి
పూరణ : సేవన్కూల్చన్ ధాత్రిం
దేవా నీచంబుగాదె! నేడున్ నాడున్!
కావగ నాస్థితిగతులను
భావిని , భారత వికాస పరిషత్బుట్టెన్!!
న్యస్తాక్షరి :
1వ పా ॓5వ అక్షరం దా 2వ పా ॓8 వ అక్షరం శ
3వ పా॓12 వ అక్షరం ర 4వ పా ॓14 వ అక్షరం థీ
పూరణ :
వణికిరి దానవుల్ సకల వానరసేననుజూచి ముందుగా!
కనుగొని రామ నీశ, కైవడినెంచక రాక్షసాధముల్
పనివడి పోరి, ఘరమగు వైర తోడను కూలిరందరున్
తనిసిరి వేల్పులెల్లరును దాశథీ కరుణాపయోనిధీ!!
ప్రార్థన:
అజహరి రుద్రాదులకున్
భజన సులభుడైన వేల్పు వరదాయకునిన్
గజవక్తృ సంస్మరింతును
నిజ భక్తిన్ సర్వకార్య నిర్విఘ్నతకున్
వరవీణా మృదుపాణి! నీ చరణ సేవా భాగ్యమే గోరుదున్!
ధరలో నే కవి కైత చెప్పుటకు నీ దాక్షిణ్యమే దిక్కగున్!
స్వరమై నీ వెద నిల్చినన్ ! గళము తా పల్కున్ గదా శారదా!
స్థిరమోదంబిడి బ్రోచి ! నా ప్రతిభ నుద్దీపింపగా చేయుమా!
వాణీ నీ దయ లేని నాడు జగతిన్ వాక్సూనముల్ విచ్చునే
వీణా పాణి వినోద నాద చయ సంవిత్సంపదాశ్రేణి గీ
ర్వాణీ మ్రొక్కెద సర్వ శాస్త్ర జననీ వాగ్దాయినీ బ్రోచి బ్ర
హ్మాణీ పల్కుల రాణి సంతతము జిహ్వాగ్రమ్మునన్నిల్వుమా!!
వాణికి, నాది నీరజ భవాంచిత రాజ్ఞికి, స్తుత్య నిత్య గీ
ర్వాణ సమాన మానధన పండితషండ రసజ్ఞ సంవృత
శ్రేణికి, ధాతృ మానస వశీకరణాద్భుత కాచ్ఛపేయ ని
క్వాణ వినోదికిన్, కమల పావన పీఠికి నంజలించెదన్
పంచ ముఖంబులన్వెలసి భక్తుల బ్రోచెడు వేదమాత నీ
పంచ్అను చేరి వేడెదను పాదములన్ విడనింక దేవి నే
నెంచితి నీవ దైవముగ నేమని చెప్పుదు నీదు శక్తి రా
యంచయె వాహనమ్ముగ మదార్తిని దీర్చు మదంబరో నతుల్!
కలనైనన్ నిను మరువక
తలతుము రాంభట్ల వంశ దైవమ! సతమున్
నిలకడతో మము గాంచెడి
యిలువేలుపు వేంకమాంబ నెద ప్రార్థింతున్!!
రాంభట్లాన్వయ కీర్తి కేతనమునాన్ రాజిల్లె ముత్తాత, మా
కంభోజాక్షుని భంగి, సద్యశము దా నార్జించె, తద్భిక్షగా
నంభోజాసను భామినిం గొలువ శక్త్యాసక్తి నా కబ్బెనే
సంభావింతును వేంకటార్యుని మదిన్! సత్యమ్ము! నిత్యమ్ముగా!!